Farmers: సీఎం జగన్ ను కలవడానికి వచ్చిన టాలీవుడ్ ప్రముఖుల వద్ద రాజధాని రైతుల నిరసన

  • ఈ మధ్యాహ్నం సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ
  • గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ లో బస చేసిన సినీ ప్రముఖులు
  • తమ ఉద్యమానికి సహకరించాలని కోరిన రైతులు
Amaravathi farmers protests at Tollywood celebrities

రాష్ట్రంలో షూటింగులకు అనుమతి, థియేటర్లలో ప్రదర్శనలు వంటి అంశాలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రముఖుల బృందం కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంది. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేశ్ బాబు తదితరులు ఈ మధ్యాహ్నం సీఎం జగన్ తో భేటీ కానున్నారు. కాగా, ప్రస్తుతం విజయవాడలోని గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. టాలీవుడ్ ప్రముఖుల రాక గురించి తెలుసుకున్న రాజధాని రైతులు గెస్ట్ హౌస్ ఎదుట నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా సినీ ప్రముఖులను కలిసిన రాజధాని రైతులు రాజధానిని కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. 175 రోజులుగా అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నామని, తమ ఉద్యమానికి సినీ ప్రముఖులు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. రైతుల సమస్యలపై ఎన్నో సినిమాలు తీశారని, తాము చేస్తున్న ఉద్యమానికి కూడా సహకరించాలని అన్నారు. కాగా, గెస్ట్ హౌస్ లోకి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో రైతులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

More Telugu News