Hyderabad: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఒక్క రోజే 92 కేసులు

  • గత రెండుమూడు రోజుల కంటే కాస్త తక్కువ
  • 3,742కు పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
  • తక్కువ లక్షణాలుంటే హోం ఐసోలేషన్‌కు తరలింపు
Corona Virus Cases in Telangana Raised to 3742

తెలంగాణలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. రోజూ పదుల సంఖ్యలో వెలుగుచూస్తూ ప్రజలను భయపెడుతున్నాయి. నిన్న ఒక్క రోజే కొత్తగా 92 కేసులు నమోదయ్యాయి. అయితే, గత రెండుమూడు రోజులుగా చూస్తే మాత్రం ఈ సంఖ్య కొంచెం తక్కువే. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,742కు పెరిగింది. తాజాగా, మరో ఐదుగురు కరోనా కాటుకు బలికావడంతో మృతుల సంఖ్య 142కు చేరింది.

ఇకపై స్పల్ప లక్షణాలున్న వారికి ఇంట్లోనే చికిత్స అందించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని అమల్లో పెట్టారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 393 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. వీరిలో 310 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా, ఇంట్లో ప్రత్యేక గదిలేని 83 మందిని అమీర్‌పేటలోని ప్రకృతి చికిత్సాలయకు తరలించారు. 67 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఆసుపత్రి ఐసీయూలో 300 మంది, వార్డుల్లో 210 మంది చికిత్స పొందుతున్నట్టు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

More Telugu News