Gollala Mamidada: ఒక్కడి ద్వారా 116 మందికి కరోనా... గొల్లల మామిడాడ గ్రామంలో కరోనా బీభత్సం!

  • తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభణ
  • కరోనాతో మరణించిన ఫొటోగ్రాఫర్
  • గొల్లల మామిడాడలో రికార్డు కేసులు
Gollala Mamidada witnesses more corona cases

కొన్నివారాల కిందట ఏపీలో కరోనా ప్రభావం సాధారణ స్థాయిలో ఉండగా, లాక్ డౌన్ సడలింపుల పుణ్యమా అని, పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోనూ కరోనా కేసుల సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది.

జిల్లాలోని పెదపూడి మండలం గొల్లల మామిడాల గ్రామం, ఆ చుట్టు పక్కల కరోనా క్రమంగా విజృంభిస్తోంది. అక్కడ తొలికేసే మరణంతో మొదలైంది. తాజాగా ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. కేవలం ఒక వ్యక్తి ద్వారా 116 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు.

గొల్లల మామిడాడకు చెందిన ఆ వ్యక్తి (53) కరోనాతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరి పరిస్థితి విషమించడంతో మరణించాడు. ఆసుపత్రిలో చేరిన అరగంటలోనే అతడి ప్రాణాలు పోయాయి. అతడు ఓ హోటల్ లో పనిచేస్తూ ఫొటోగ్రాఫర్ గానూ వ్యవహరిస్తున్నాడు. అతడి కారణంగానే గొల్లలమామిడాడలోనూ, పరిసర గ్రామాల్లో కరోనా వ్యాపించిందని అధికారులు తెలుసుకున్నారు. ఇటీవల రామచంద్రపురం గ్రామంలో ఓ కార్యక్రమం జరగ్గా, ఈ వ్యక్తి ఫొటోలు తీశాడు. అంతేకాదు, స్థానికంగా ఓ స్వచ్ఛంద సేవాసంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాస్కులు కూడా పంపిణీ చేశాడు.

అయితే అతడి కుమారుడు కూడా కరోనాతో బాధపడుతుండడంతో, ఎవరి ద్వారా ఎవరికి వచ్చిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకే గ్రామంలో వందకు పైగా కేసులు రావడం దేశంలో ఇదే ప్రథమం కాగా, గొల్లల మామిడాడ గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి, ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

More Telugu News