Sanjay Raut: ముంబయి, గుజరాత్ లో కరోనా వ్యాప్తికి 'నమస్తే ట్రంప్' కార్యక్రమమే కారణం: శివసేన ఎంపీ ఆరోపణ

  • గుజరాత్, ముంబయిలో కరోనా విజృంభణ
  • ట్రంప్ ను స్వాగతించడానికి లక్షలమంది వచ్చారన్న రౌత్
  • వారంతా వివిధ ప్రదేశాలకు తిరిగి వెళ్లడంతో కరోనా వ్యాప్తి చెందినట్టు వెల్లడి
Shivsena MP Sanjay Raut accuses Namaste Trump event caused corona spread in Gujarat and Mumbai

ఫిబ్రవరి నెలలో భారత్ లో  జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో కరోనా మహమ్మారి చైనాలో విలయతాండవం చేస్తోంది. అయితే, నమస్తే ట్రంప్ కార్యక్రమం వల్లే గుజరాత్, ముంబయి, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కరోనా బీభత్సం కొనసాగిస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలమంది ప్రజలు వచ్చారని, వారంతా తిరిగి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో కరోనా వ్యాప్తి అధికమైందని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను స్వాగతించడానికి భారీ సంఖ్యలో ప్రజలు రావడమే కరోనా వ్యాప్తికి కారణమని, ఈ విషయంలో కేంద్రం ఏ విధంగా సమర్థించుకోగలదని వ్యాఖ్యానించారు. ట్రంప్ వెంట అమెరికా నుంచి వచ్చిన కొందరు ముంబయి, ఢిల్లీ వంటి నగరాలను సందర్శించారని, ఇలాంటి పరిణామాలే దేశంలో కరోనా వ్యాప్తికి దారితీశాయని రౌత్ విమర్శించారు. ఈ మేరకు సామ్నా పత్రికలోని తన సంపాదకీయంలో పేర్కొన్నారు.

More Telugu News