Telangana: నాగర్‌కర్నూలులో కరోనాతో కన్నుమూసిన 58 రోజుల చిన్నారి

  • 27న అనారోగ్యానికి గురైన శిశువు
  • కరోనా సోకినట్టు నిర్ధారించిన నిలోఫర్ వైద్యులు
  • 28 మంది హోం క్వారంటైన్
58 days toddler dead in Nagarkurnool dist

తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతలలో 58 రోజుల చిన్నారి కరోనాతో కన్నుమూసింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే చిన్నారి తల్లిదండ్రులు నివసిస్తున్న బీసీ కాలనీకి చేరుకుని ఇంటిని పరిశీలించారు. కొత్తవారు ప్రవేశించకుండా కాలనీని దిగ్బంధం చేశారు. ఏప్రిల్ మూడో తేదీన నాగర్‌కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ తల్లి మగబిడ్డకు జన్మనిచ్చింది.

పది రోజుల అనంతరం వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో ఉప్పునుంతలలోని తల్లిగారింటికి చేరుకుంది. అయితే, ఈ నెల 27న బాబు అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే అచ్చంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు బాబును హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు శిశువుకు కరోనా సోకినట్టు నిర్ధారించి అతడితో పాటు తల్లిదండ్రులనూ గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు.

అయితే, అక్కడ చేరేలోపే బాబు మరణించాడు. స్పందించిన అధికారులు, తల్లిదండ్రుల ఇద్దరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసిన 28 మందిని హోం క్వారంటైన్ చేశారు.

More Telugu News