Corona Virus: కరోనా సోకినా సరే.. ప్రజల మనోగతంపై లేటెస్ట్ సర్వే!

  • ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు వెళ్లలేము
  • కేంద్రం స్పందించి వైద్య ఖర్చును ఖరారు చేయాలి
  • లోకల్ సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయం
Latest Survery on Corona by Local Circles

తమకు కరోనా సోకినప్పటికీ, వైద్య చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లేది లేదని అత్యధికులు స్పష్టం చేస్తున్నారు. కరోనా వైరస్ కు చికిత్స విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు  ఆసుపత్రులు అందిస్తున్న సేవలు, వాటిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల గురించి లోకల్ సర్కిల్స్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 40 వేల మందిని భాగస్వామ్యం చేస్తూ అధ్యయనం చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మొత్తం 5 ప్రశ్నలను లోకల్ సర్కిల్స్ సంధించింది.

అధ్యయనంలో పాల్గొన్న వారిలో  57 శాతం మంది వైరస్ సోకితే ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక చార్జీల బాదుడును తట్టుకునే శక్తి తమకు లేదని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే, సెకండరీ కాంటాక్టుల ద్వారా వ్యాధి సోకవచ్చని 46 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకుని, కరోనా చికిత్సకు కొంత మొత్తాన్ని ఖరారు చేయాలని 61 శాతం మంది కోరారు.

కరోనా కేసులు పెరిగితే, రోగులకు సరిపడా వైద్య సదుపాయాలు దేశంలో లేవని 32 శాతం మంది అభిప్రాయపడగా, తమకు వ్యాధి వస్తే, ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్సకు వెళతామని కేవలం 22 శాతం మంది మాత్రమే చెప్పడం గమనార్హం. మరో 32 శాతం మంది తామసలు హాస్పిటల్ కే వెళ్లబోమని చెప్పగా, మరో 32 శాతం మంది ప్రైవేటు ఆసుపత్రులను ఎంచుకుంటామని అన్నారు.

తాము నిర్వహించిన సర్వేలో, ప్రజల ఆర్థిక పరిస్థితి తలకిందులు అయినట్టు కూడా తేలిందని సర్వే నిర్వహించిన లోకల్ సర్కిల్స్ జీఎం అక్షయ్ గుప్తా తెలియజేశారు. అధికంగా డబ్బులు వెచ్చించి ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే శక్తి తమకు లేదని అత్యధికులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు.

More Telugu News