Quarantine Centre: క్వారంటైన్ కేంద్రంలోనే పెళ్లి చేసుకున్న ప్రేమజంట!

  • ఒడిశాలోని పూరీ జిల్లా సాగాడ గ్రామంలో ఘటన
  • కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న జంట
  • జనవరిలో గుజరాత్‌కు పారిపోయిన వైనం
  • తిరిగి సొంత గ్రామానికి రావడంతో క్వారంటైన్‌
marriage in quarantine

ఒడిశాలోని పూరీ జిల్లా సాగాడ గ్రామంలో క్వారంటైన్‌లో ఉంటోన్న ఓ జంట అక్కడే పెళ్లి బంధంతో ఒక్కటైంది. సౌరబ్ దాస్ (19), పింకీరాణి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పింకీరాణితో ఈ ఏడాది జనవరిలో ఆ యువకుడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి వెళ్లిపోయాడు.

అక్కడే ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేస్తూ ఆమెతో సహజీవనం కొనసాగించాడు. లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమ మూసివేయడంతో తిరిగి సొంత గ్రామానికి వచ్చారు. వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేశారు. అయితే, నెగిటివ్‌గా తేలినప్పటికీ 14 రోజుల పాటు అధికారులు వారిని క్వారంటైన్‌లో ఉంచారు.

అప్పటికే పింకీరాణి గర్భవతి అని అధికారులు తెలుసుకున్నారు. క్వారంటైన్ సమయం ముగియడంతో అందులోనే వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. క్వారంటైన్‌ కేంద్రంలో ఇన్‌చార్జీలుగా ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు వధూవరుల తల్లిదండ్రులుగా దగ్గరుండి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఆ జంట ఇంటికి వెళ్లిపోయింది.

More Telugu News