లిక్కర్ డోర్ డెలివరీ ప్రారంభించిన స్విగ్గీ, జొమాటో!
- రెస్టారెంట్లు మూత పడటంతో కుదేలైన స్విగ్గీ, జొమాటో
- లిక్కర్ డెలివరీతో బిజినెస్ పెంచుకునే యోచన
- రాంచీలో ఈరోజు లిక్కర్ డెలివరీ ప్రారంభం
లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే అన్ని రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మకాలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో, వైన్ షాపుల వద్ద పెద్ద క్యూలు, పోలీసుల లాఠీ ఛార్జీలు వంటివి చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా మద్యం అమ్మకాల చర్చ తెరపైకి వచ్చింది. మద్రాస్ హైకోర్టు కూడా ఆన్ లైన్ అమ్మకాలు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ క్రమంలో స్విగ్గీ, జొమోటాలు లిక్కర్ డెలివరీని ప్రారంభించాయి.
తొలి విడతతో కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే లిక్కర్ డెలివరీ చేయనున్నాయి. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. నెమ్మదిగా ఈ సేవలను ఇతర నగరాలకు విస్తరించనున్నాయి. రెస్టారెంట్లు మూతపడిన తరుణంలో లిక్కర్ డెలివరీతో కొంత రెవెన్యూ సంపాదించుకోవచ్చనే యోచనలో ఉన్నాయి.