Tamil Nadu: ఓ వైపు కరోనా.. మరోవైపు సూరీడు.. బెంబేలెత్తుతున్న చెన్నై వాసులు!

High Temperature  recorded in Chennai amid Corona fear
  • నిన్న 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
  • సడలింపులు ఇచ్చినా వేడికి భయపడి ఇంటికే పరిమితం అవుతున్న ప్రజలు
  • కరోనా గుప్పిట్లో చెన్నై
ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న చెన్నై వాసులను ఇప్పుడు వేసవి వేడి వేధిస్తోంది. భానుడి ఉగ్రరూపానికి నగర వాసులు బెంబేలెత్తుతున్నారు. నగరంలో నిన్న ఏకంగా 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వేలూరు, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

దీంతో పిల్లలు, వృద్ధులు ఎండవేడికి తట్టుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఎండవేడికి తాళలేని జనం ఇళ్లకే పరిమితం కావడంతో జన సంచారం లేక రోడ్లు బోసిపోయాయి. లాక్‌డౌన్ సడలింపులతో ప్రభుత్వం ఊరటనిచ్చినా ఎండ వేడిమి మాత్రం జనాలను బయటకు రానీయడం లేదు.

మరోవైపు, కరోనా వైరస్ చెన్నైని తన గుప్పిట్లో బంధించేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 13,191  కేసులు నమోదు కాగా, ఒక్క చెన్నైలోనే 8,234 మంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం 5,350 కేసులు యాక్టివ్‌గా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం మరణాల్లో 61 చెన్నైలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
Tamil Nadu
chennai
Corona Virus
summer
Temperature

More Telugu News