Rolls Royce: 9 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన ‘రోల్స్ రాయిస్’

  • ప్రస్తుత సంక్షోభంలో నిర్ణయం తీసుకోక తప్పలేదన్న కంపెనీ
  • ఉద్యోగుల తొలగింపుతో 1.3 బిలియన్ డాలర్లు ఆదా
  • మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు
 RollsRoyce announces termination of 9000 employees

కరోనా లాక్‌డౌన్ కారణంగా అల్లాడిపోతున్న అనేక సంస్థలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను పెద్ద మొత్తంలో తొలగిస్తున్నాయి. ఇప్పుడీ కోవలోకి  యూకే ఇంజనీరింగ్ దిగ్గజం రోల్స్ రాయిస్ హోల్డింగ్స్ వచ్చి చేరింది. లాక్‌డౌన్ కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ఖర్చులు తగ్గించుకునేందుకు 9 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని పేర్కొంది. ఉద్యోగుల తొలగింపుతో  1.3 బిలియన్ డాలర్లు ఆదా కానున్నట్టు తెలిపింది.

17వ వంతు ఉద్యోగులను తొలగించాలన్న ఈ నిర్ణయం తమ సివిల్ ఏరోస్పేస్ విభాగాన్ని ప్రభావితం చేస్తుందని, ఇది తయారీ సంక్షోభం కాకపోయినా ఇతర సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని రోల్స్ రాయిస్ సీఈవో బాస్ వారెన్ ఈస్ట్ పేర్కొన్నారు. ఉద్యోగ కోతల్లో ఎక్కువ భాగం యూకేలోనే ఉంటాయని తెలుస్తోంది. మరోపక్క, ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

More Telugu News