Andhra Pradesh: పంచాయతీ కార్యాలయాలకు రంగులపై తీర్పు రిజర్వు చేసిన ఏపీ హైకోర్టు

  • న్యాయవాది సోమయాజులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు
  • పంచాయతీ భవనాలకు ఇప్పటికీ అవే రంగులు వేస్తున్నారన్న పిటిషనర్
  • వాటిని తొలగించమని గతంలోనే ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసిన ధర్మాసనం
AP High Court reserved judgment on colors for panchayat offices

ఏపీలోని గ్రామ పంచాయతీ భవనాల రంగుల కేసు విషయంలో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో ఆయా పంచాయతీ భవనాలకు వైఎస్సార్ పార్టీ జెండా రంగులను పోలిన రంగులనే ఇంకా వేస్తున్నారంటూ న్యాయవాది సోమయాజులు పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ అంశంపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికీ ఆ పార్టీ జెండా రంగులను పోలినవే వేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు.

దీనికి స్పందించిన న్యాయస్థానం.. ఆ రంగులను తొలగించమని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే, ఈ సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. వాటికి ఏ ఉద్దేశంతో ఆ రంగులు వేస్తున్నామన్న వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు హైకోర్టుకు తెలిపారు. గతంలో వేసిన రంగుతోపాటు అదనంగా మరో రంగును కలిపి వేస్తున్నట్టు న్యాయస్థానానికి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.

More Telugu News