BJP: పోతిరెడ్డిపాడు విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ మండిపాటు.. రేపు నల్ల జెండాల ఎగురవేత

  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్ కమిటీ సభ్యులతో బండి సంజయ్ సమావేశం
  • ఏపీ జీవో 203 విషయంలో ప్రభుత్వ వైఖరిపై మండిపాటు
  • రేపు ఉదయం కార్యకర్తలు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేయాలని పిలుపు
Bandi Sanjay Asks party workers hoist Black Flags

పోతిరెడ్డిపాడు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా రేపు నల్ల జెండాలు ఎగురవేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ నిర్ణయించింది. ఉదయం 10-11 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేయాలని పార్టీ పిలుపునిచ్చింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు, రైతుల ఆందోళన తదితర అంశాలపై కమిటీ చర్చించింది. పోతిరెడ్డిపాడు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నేతలు మండిపడ్డారు.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్ల జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే తాను చెప్పిన పంటలనే వేయాలని రైతులను బెదిరిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై సంతృప్తి వ్యక్తం చేసిన కోర్ కమిటీ ఈ సందర్భంగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపింది.

More Telugu News