Dharmapuri Aravind: తెలంగాణకు అన్యాయం చేస్తున్న జగన్ పై కేసీఆర్ నోరు లేస్తలేదు ఎందుకు?: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

  • మా నీళ్లు ఆంధ్రోళ్లు తీస్కపోతున్నారని నాడు కేసీఆర్ గొడవ చేశారు
  • ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు?
  • కృష్ణా జలాలను జగన్ తరలించడం దురదృష్టకరం
Bjp Mp Dharmapuri Aravind statement

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి తెలంగాణకు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై కేసీఆర్ నోరు లేస్తలేదు ఎందుకు? అంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. ‘మా నీళ్లు ఆంధ్రోళ్లు తీస్కపోతున్నారని దశాబ్దం పాటు గత్తర లేపిన కేసీఆర్, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నాడు?’ అని ప్రశ్నించారు.

 తెలంగాణ ప్రజలు చేసిన మేలును జగన్ మరవొద్దు

తెలంగాణ ప్రజల దాహం తీర్చే కృష్ణానదీ జలాలను జగన్ తరలించుకుపోవడం దురదృష్టకరమని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది రాయలసీమ, ఆంధ్రా ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు కూడా అన్న విషయాన్ని జగన్ మర్చిపోయినట్టున్నారని విమర్శించారు. జగన్ కు అంగబలం, అర్ధబలం ఇవాళ ఎంతైతే ఉందో దానికి తెలంగాణ ప్రజలు కూడా సహాయ సహకారాలు, మద్దతు అందించారని, కనుకనే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో జగన్ కూర్చోగలిగారని అన్నారు.

జగన్ కు తెలంగాణ ప్రజలు చేసిన మేలును మరవొద్దని, ఈ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడి నిధులు అయితే చాలా తీసుకుపోయారని విమర్శించారు. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చాలా మంది అభిమానులు ఉన్నారని, వాళ్లందరి అభిమానాన్ని తుంగలోకి తొక్కద్దంటూ జగన్ కు సూచించారు.

More Telugu News