Srisailam: మాకు చెప్పకుండా కొత్త ప్రాజెక్టా?... ఏపీ ప్రభుత్వంపై కేసీఆర్ ఆగ్రహం!

  • శ్రీశైలంపై కొత్త ప్రాజెక్టు నిర్మించాలని జగన్ సర్కారు జీవో
  •  అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం
  • తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే సహించబోము
  • హెచ్చరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
KCR Fires on AP Govt

శ్రీశైలం జలాలపై కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ నిర్ణయాన్ని అడ్డుకుని తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించేలా ఏపీ ప్రభుత్వం జీఓ తీసుకురావడం విభజన చట్టానికి విరుద్ధమని, అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకుని తప్పు చేశారని, ఈ విషయంలో తమను సంప్రదించకపోవడం బాధాకరమని అభిప్రాయపడ్డ ఆయన, ప్రాజెక్టును ఆపాలంటూ కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డులో రాష్ట్రం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా, శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించగా, ఈ విషయంపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అపెక్స్ కమిటీ నుంచి ఆమోదం పొందకుండానే ఏపీ ముందడుగు వేసిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టు రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టని, ఏ కొత్త నిర్మాణమైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించే తీసుకోవాలని, ఈ ప్రాజెక్టుతో పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీటి సమస్య ఏర్పడుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

గతంలో నెలకొన్న విభేదాలను, వివాదాలను పక్కనబెట్టి నదీ జలాలను వాడుకుందామని తాను స్నేహహస్తం అందించానని, భేషజాలు లేకుండా తాను చొరవ చూపితే, తమను సంప్రదించకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం బాధను కలిగించిందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోనని అన్నారు. నదిలో నీటి వాటాలను తేల్చడంలో ట్రైబ్యునల్ లో జాప్యం జరుగుతోందని గుర్తు చేసిన ఆయన, సత్వర న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దామని అన్నారు.

More Telugu News