UAE: స్వదేశం వచ్చేందుకు.. బంగారాన్ని అమ్ముకుంటున్న యూఏఈలోని భారత కార్మికులు

  • ఉపాధి కోల్పోయి, వేతనాల్లో కోతతో ఇబ్బంది
  • విమాన టికెట్ల కోసం బంగారాన్ని విక్రయించక తప్పని పరిస్థితి
  • కిక్కిరిసిపోతున్న దుబాయ్‌లోని దుకాణాలు
Migrant workers in UAE selling Gold for Flight Tickets

విదేశాల్లోని భారతీయ వలస కార్మికుల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వీరంతా ఇప్పుడు స్వదేశం వచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారత వలస కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కోవిడ్-19 కారణంగా ఉపాధి కోల్పోయి, జీతాల్లో కోతతో చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతున్న కార్మికులు ఇప్పుడు స్వదేశం వచ్చేందుకు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్ముకుంటున్నారు.

ఈ నెల 7 నుంచి భారత్‌కు విమాన సర్వీసులు ప్రారంభమైనా విమాన టికెట్లకు డబ్బుల్లేకపోవడంతో తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేసుకుంటున్నారు. ఇలా బంగారాన్ని అమ్ముకుంటున్న వారితో దుబాయ్‌లోని మీనాబజార్, డేరా ప్రాంతాల్లోని చిన్నచిన్న బంగారు దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. అదే బంగారాన్ని భారత్‌లో అమ్ముకుంటే 12 శాతం వరకు ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉన్నా మరో మార్గం లేక విక్రయిస్తున్నట్టు కొందరు కార్మికులు తెలిపారు.

More Telugu News