CSIR: వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై నిపుణులు సమర్పించిన నివేదికలో ఆసక్తికర అంశాలు

  • క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ నిపుణులు
  • కేంద్రానికి నివేదిక
  • ఓ ఇంట్లో 1.7 పీపీఎం పరిమాణంలో స్టిరీన్ ను గుర్తించినట్టు వెల్లడి
Experts submits report on Vizag gas leak incident

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టిరీన్ విషవాయువు లీకైన ఘటనపై సీఎస్ఐఆర్-ఎన్ఈఈఆర్ఐ నిపుణుల బృందం కేంద్రానికి నివేదిక సమర్పించింది. గత కొన్నిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటించిన ఈ బృందం కేంద్రానికి పలు సిఫారసులు చేసింది. నిపుణులు పరిశ్రమ సమీపంలోని రోడ్లు, నివాసాల్లో స్టిరీన్ అవశేషాలను గుర్తించారు. ఓ ఇంట్లో అత్యధికంగా 1.7 పీపీఎం పరిమాణంలో స్టిరీన్ ను గుర్తించినట్టు నివేదికలో పేర్కొన్నారు.

నివాసాలను పూర్తిగా శుభ్రపరిచాకే ప్రవేశించాలని స్పష్టం చేశారు. స్టిరీన్ ప్రభావానికి గురైన వారు ఏడాదిపాటు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. విషవాయు ప్రభావానికి గురైన 5 గ్రామాల్లోనూ, పరిశ్రమ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోనూ పండిన కూరగాయలు, పండ్లను వినియోగించరాదని తెలిపారు. ఇదే పరిధిలోని గ్రాసాన్ని కూడా పశువులకు అందించవద్దని, విషవాయు ప్రభావానికి గురైన మొక్కలను కూడా తొలగించాలని నిపుణులు పేర్కొన్నారు.

More Telugu News