Twins: బెంగళూరులో పండంటి కవలలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ యువతి

  • నెలలు నిండడంతో ఆసుపత్రిలో చేరిన యువతి
  • టెస్టులు చేయడంతో కరోనా నిర్ధారణ
  • ఆమె భర్తకూ కరోనా పాజిటివ్
Corona positive woman gives birth to twins in Bengaluru

ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వ్యాపిస్తున్న కరోనా వైరస్ గర్భవతులకు కూడా సోకుతోంది. బెంగళూరులో ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, వారిద్దరూ బిడ్డలకు జన్మనిచ్చారు. వారిలో 20 ఏళ్ల యువతి కవల పిల్లలకు జన్మనివ్వడం విశేషం.

బెంగళూరులోని పాదరాయణపురకు చెందిన ఆ యువతి నెలలు నిండడంతో ఈ నెల 7న బెంగళూరులోని వాణి విలాస్ ఆసుపత్రిలో చేరింది. అయితే పాదరాయణపుర ప్రాంతాన్ని ప్రభుత్వం అప్పటికే కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించింది. ఆ యువతి ఆసుపత్రి వర్గాలకు ఈ విషయాన్ని చెప్పకుండా దాచింది. కానీ వారు ఆమెకు ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అప్పుడు గట్టిగా అడగడంతో తాను పాదరాయణపుర నుంచి వచ్చినట్టు తెలిపింది. అటు ఆమె భర్త కూడా కరోనా పాజిటివ్ తో బాధపడుతున్నట్టు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఆ కవల శిశువులను కూడా అబ్జర్వేషన్ లో ఉంచారు. ఇక, 34 ఏళ్ల మరో మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు కూడా కరోనా నిర్ధారణ అయింది. అయితే, మొత్తం ముగ్గురు శిశువులు వాణి విలాస్ ఆసుపత్రిలో ఉండగా, వారి తల్లులను మాత్రం ట్రామా కేర్ సెంటర్ లో కరోనా చికిత్స పొందుతున్నారు.

More Telugu News