Telangana: ఇవాళ 10 కేసులే... 14 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన తెలంగాణ

  • తెలంగాణలో 1,132కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
  • ఇవాళ 34 మంది డిశ్చార్జి
  • వివరాలు వెల్లడించిన మంత్రి ఈటల
Telangana registers ten corona cases today

తెలంగాణలో ఇవాళ 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,132కి పెరిగింది. కొత్తగా నమోదైన 10 కేసులూ జీహెచ్ఎంసీ పరిధిలోనివే. ఇక, రాష్ట్రంలో మరణాల సంఖ్య 29 కాగా, ఓవరాల్ గా 727 మంది కోలుకున్నారు. ఈ ఒక్కరోజే 34 మందిని డిశ్చార్జి చేశారు. ఈ వివరాలను తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.

 కాగా, కొత్త కేసులు నమోదు కాని 14 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని వివరించారు. 14 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తే 80 శాతం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

అయితే, తెలంగాణలో తక్కువ కేసులు నమోదవుతుండడం పట్ల ఆరోపణలు రావడంపై ఈటల స్పందించారు. తాము తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణల్లో నిజంలేదని, తాము ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నామని, సరైన రీతిలో పరీక్షలు చేయడం లేదన్నది అవాస్తవమని చెప్పారు. ఇప్పుడు కేసులు తగ్గుతున్నందున ఆ స్థాయిలోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరణ ఇచ్చారు.
.

More Telugu News