Naga Chaitanya: చైతూతో ఎలాంటి గొడవలేదు: దర్శకుడు చందూ మొండేటి

  • 'ప్రేమమ్'తో చైతూకి దక్కిన హిట్
  • 'సవ్యసాచి'తో ఎదురైన పరాజయం
  • మూడో సినిమా ఉంటుందన్న  చందూ
Chandu Mondeti Movie

'కార్తికేయ' సినిమాతో దర్శకుడిగా తానేమిటనేది చందూ మొండేటి నిరూపించుకున్నాడు. నాగ చైతన్యతో ఆయన తెరకెక్కించిన 'ప్రేమమ్' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చైతూకు ప్రేమకథలు బాగా సెట్ అవుతాయనే టాక్ కి ఈ సినిమా మరింత బలాన్ని చేకూర్చింది. ఆ తరువాత చైతూతో ఆయన 'సవ్యసాచి' అనే సినిమా చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.

ఈ సినిమా షూటింగు సమయంలోనే చైతూకి .. చందూకి మధ్య మనస్పర్థలు తలెత్తాయనే టాక్ వచ్చింది. ఒక విషయం కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగిందనే ప్రచారం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. తాజాగా ఈ విషయాన్ని గురించి చందూ మొండేటి మాట్లాడుతూ, 'నేను .. చైతూ  గొడవ పడినట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. నాకున్న మంచి స్నేహితుల్లో చైతూ ఒకరు. త్వరలోనే ఆయనతో ఒక సినిమా ఉంటుంది. ప్రస్తుతం నేను 'కార్తికేయ 2' సినిమా పనుల్లో వున్నాను. ఈ సినిమా హిట్ అయితే, చైతూ దగ్గర నుంచి కాల్ వస్తుందనే అనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చాడు.

More Telugu News