Nizamuddin Markaz: క్వారంటైన్ గడువు పూర్తయిన తబ్లిగీ జమాత్ సభ్యుల విడుదలకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు!

  • 4 వేల మందిలో 900 మంది ఢిల్లీకి చెందినవారు
  • మిగిలినవారిలో అత్యధికులు తెలంగాణ, తమిళనాడుకు చెందినవారు
  • మర్కజ్ ఘటనతో సంబంధం ఉన్నవారిని పోలీసులకు అప్పగించాలని ఆదేశం
Delhi govt orders to release 4000 Tablighi Jamaat members

తబ్లిగీ జమాత్ సభ్యులకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో క్వారంటైన్ గడువును పూర్తి చేసుకున్న 4 వేల మంది తబ్లిగీ సభ్యులను విడుదల చేయాలని ఈరోజు ఆదేశించింది. అయితే, మర్కజ్ ఘటనతో సంబంధం ఉన్నవారిని మాత్రం విచారణ నిమిత్తం ఢిల్లీ పోలీసుల కస్టడీకి అప్పగించాలని హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మర్కజ్ ఘటనతో సంబంధం లేని వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపించాలని ఆదేశించినట్టు ఈ సందర్భంగా హోం మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల రెసిడెంట్ కమిషనర్లతో సంప్రదింపులు జరపాలని హోం శాఖ అధికారులను ఆదేశించామని చెప్పారు.

ఢిల్లీ క్వారంటైన్లలో అధికారిక లెక్కల ప్రకారం 4 వేల మంది తబ్లిగీ సభ్యులు ఉన్నారు. వీరిలో 900 మంది ఢిల్లీకి చెందినవారు కాగా... మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికులు తెలంగాణ, తమిళనాడుకు చెందినవారని చెప్పారు. ఢిల్లీ క్వారంటైన్లలో కొందరు తబ్లిగీ సభ్యులు ఆరోగ్య సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.

More Telugu News