Stock Market: భారీ నష్టం... సుమారు 5 శాతం పతనంలో స్టాక్ మార్కెట్!

  • మరో మారు భారీ నష్టంలో మార్కెట్
  • ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసిన లాక్ డౌన్ పొడిగింపు
  • 1,659 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
Huge Loss for Indian Stock Market

భారత స్టాక్ మార్కెట్ మరోమారు భారీ నష్టాల్లోకి జారి పోయింది. లాక్ డౌన్ ను పొడిగిస్తూ, తీసుకున్న నిర్ణయం, చైనాపై అమెరికా మరిన్ని సుంకాలను విధించనున్నట్టు వచ్చిన వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఇదే సమయంలో యూఎస్ ఫ్యూచర్స్ సూచీలు 1.7 శాతం పడిపోవడం, ఆసియా మార్కెట్ల పతనం ప్రభావం చూపించడంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు దాదాపు 5 శాతం మేరకు పడిపోయాయి.

ఈ ఉదయం 10. 45 గంటల సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 1659 పాయింట్లు పడిపోయి 4.92 శాతం నష్టంతో 32,058 పాయింట్ల వద్దా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 468.95 పాయింట్లు పడిపోయి 4.76 శాతం నష్టంతో 9,390 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. అంతకుముందు ఓ దశలో నిఫ్టీ 9,355 పాయింట్ల సెషన్ కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ-50లో 47 కంపెనీలు నష్టాల్లో ఉండగా, సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి. ఫార్మా రంగం మినహా మిగతా అన్ని సెక్టార్లూ నష్టపోయాయి.

ఇక ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే, నిక్కీ 2.84 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 2.22 శాతం, హాంగ్ సెంగ్ 3.95 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 2.42 శాతం, కోస్పీ 2.14 శాతం, జకార్తా కాంపోజిట్ 2.35 శాతం నష్టాల్లో ఉండగా, సెట్ కాంపోజిట్ 1.48 శాతం, షాంగై కాంపోజిట్ 1.33 శాతం లాభాల్లో ఉన్నాయి.

More Telugu News