Tamil Nadu: పెళ్లి కోసం 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన న్యాయవాది అరెస్ట్

  • తమిళనాడులోని దిండిగల్‌ జిల్లాలో ఘటన
  • కిడ్నాప్‌కు సహకరించిన నిందితుడి తల్లి, అత్త 
  • అందరిపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు
Lawyer Arrested in Tamil Nadu for kidnapping Girl

వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో బాలికను కిడ్నాప్ చేసిన న్యాయవాదికి తమిళనాడు పోలీసులు అరదండాలు వేశారు. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సొట్లమాయనూరుకు చెందిన న్యాయవాది కరుపయ్య (36) వేడచెందూర్ పరిధిలో ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో కిడ్నాప్ చేశాడు. బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సందర్భంగా న్యాయవాది కరుపయ్యే బాలికను కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతడికి వివాహమైనా ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. బాలిక కిడ్నాప్‌కు న్యాయవాది తల్లి, అత్త, మరో వ్యక్తి అతడికి సహకరించినట్టు గుర్తించిన పోలీసులు వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు కరుపయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

More Telugu News