Prakash Javadekar: రేపటి నుంచి డీడీలో 'శ్రీకృష్ణ' సీరియల్ చూడండి: మరో గుడ్‌న్యూస్‌ చెప్పిన జవదేకర్

  • ఇప్పటికే రామాయణం, మహాభారతం ప్రసారం
  • ప్రతిరోజు రాత్రి 9 గంటలకు శ్రీకృష్ణ
  • డీడీ నేషనల్‌ రేటింగ్స్‌ అమాంతం పెంచేస్తోన్న నాటి సీరియళ్లు
javadekar on srikrishna

రామాయణం, మహాభారతం వంటి సీరియళ్లను పునఃప్రసారం చేస్తోన్న డీడీ నేషనల్ ఇప్పుడు శ్రీకృష్ణను కూడా ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒకప్పటి పౌరాణిక సీరియళ్లు రామాయణం, మహాభారతాలను దూరదర్శన్ పున:ప్రసారం చేస్తోన్న నేపథ్యంలో ఆ ఛానెల్‌ టీఆర్‌పీ అమాంతం పెరిగిపోయింది. ప్రైవేటు ఛానెళ్లకు పోటీగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో ఇతిహాస కావ్యం శ్రీకృష్ణ సీరియల్‌ను ఆ ఛానెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ సీరియల్‌ రేపటి నుంచే ప్రసారమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ రోజు ప్రకటించారు.

'డీడీ నేషనల్‌లో ప్రసారమైన పాప్యులర్ సీరియళ్లలో ఒకటైన శ్రీకృష్ణను రేపటి నుంచి ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం చేస్తున్నాం' అని జవదేకర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. కాగా,రామానంద సాగర్ దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ 1993 నుంచి 1996 వరకు దూరదర్శన్‌లో ప్రసారమైంది.

అంతేకాదు, ఆ తరువాత 1999లో జీ టీవీలో, అనంతరం 2001 లో సోనీ, స్టార్ వంటి చానెళ్లలోనూ ఈ సీరియల్ ప్రసారమైంది. రామాయణం, మహాభారతం వంటి సీరియళ్లు డీడీ నేషనల్‌లో రికార్డు స్థాయిలో రేటింగ్స్ సాధిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీకృష్ణకు కూడా అదే స్థాయిలో ఆదరణ వస్తుందని భావిస్తున్నారు.

More Telugu News