AIADMK: 14 మంది సమక్షంలో కుమార్తె వివాహం కానిచ్చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే

AIADMK MLA Daughters marriage kicks up political controversy
  • ఈ నెల 26న వివాహం
  • దర్యాప్తు జరిపించాలన్న డీఎంకే
  • ఆలయం బయటే వివాహం జరిగిందన్న ఎమ్మెల్యే చిత్ర
ఎమ్మెల్యే కుమార్తె వివాహమంటే ఎంత ఘనంగా జరగాలి?.. ఎంత ఆర్భాటం ఉండాలి? కానీ అవేవీ లేకుండానే తమిళనాడులోని అన్నాడీఎంకే ఎమ్మెల్యే తన కుమార్తె వివాహాన్ని జరిపించారు.

 సేలం జిల్లా ఏర్కాడు ఎమ్మెల్యే చిత్ర-గుణశేఖర్ దంపతుల కుమార్తె సింధు (21), ధర్మపురి జిల్లా పాపిరెట్టిపట్టికి చెందిన విద్యుత్ బోర్డు ఇంజినీర్ ప్రశాంత్‌ల వివాహం ఇటీవలే నిశ్చయమైంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి పళనిస్వామి నియోజకవర్గమైన వాళప్పాడిలోని తాంతోంద్రీశ్వర్ ఆలయంలో వివాహం జరుగుతుందని, సీఎం, డిప్యూటీ సీఎంలు ఈ వివాహానికి హాజరవుతున్నట్టు శుభలేఖలో పేర్కొన్నారు.

అయితే, లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో అనుకున్న ముహూర్తానికే ఆలయంలో వివాహం జరిపించినప్పటికీ అత్యంత సాదాసీదాగా జరిగింది. పురోహితుడు, ఫొటోగ్రాఫర్ సహా 14 మంది మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.

ఇదిలావుంచితే, ఈ వివాహంపై అప్పుడే రాజకీయ రగడ మొదలైంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఆలయంలో వివాహం జరిపించారంటూ డీఎంకే ఆరోపించింది. ఈ వివాహానికి పెద్ద ఎత్తున హాజరయ్యారని పేర్కొంది. దీనిపై విచారణ జరిపించాలని డీఎంకే డిమాండ్ చేసింది. అయితే, డీఎంకే ఆరోపణలను ఎమ్మెల్యే చిత్ర కొట్టిపడేశారు. వివాహం ఆలయంలో జరగలేదని, ఆలయం బయట జరిగిందని వివరణ ఇచ్చారు.
AIADMK
MLA Chitra
Marriage
DMK
Lockdown

More Telugu News