Panjab: లాక్ డౌన్ లో క్లాసులు చెబుతున్న టీచర్ ను పట్టించిన ఐదేళ్ల బుడతడు!

  • పంజాబ్ లోని బతాలాలో ఘటన
  • పిల్లలను ట్యూషన్ కు తీసుకెళుతున్న వ్యక్తి
  • ప్రశ్నించగా, సమాధానం చెప్పిన చిన్నారి
  • గట్టిగా మందలించిన డీఎస్పీ
5 Years child give Details of Teaching in Lockdown

లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి, పిల్లలకు పాఠాలు చెబుతున్న ఓ టీచర్ ను ఐదేళ్ల చిన్నారి పట్టించాడు. ఈ ఘటన పంజాబ్ లోని బతాలా పరిధిలో జరిగింది. ఇక్కడికి సమీపంలోని తాతాహారీ మొహల్లా ప్రాంతంలో ఓ టీచర్ క్లాసులు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందుకున్న డీఎస్పీ గురుదీప్ సింగ్, అతని చిరునామా కోసం గాలిస్తున్న వేళ, అతని వద్దే చదువుకునేందుకు వెళుతున్న ఐదేళ్ల బాలుడు క్లాసులు ఎక్కడ జరుగుతున్నాయో ఉప్పందించాడు.

వివరాల్లోకి వెళితే, ఓ వ్యక్తి, ఇద్దరు చిన్నారులను క్లాసులో వదిలేందుకు తీసుకుని వెళుతుండగా, కర్ఫ్యూ సమయంలో పిల్లలతో కలిసి ఎందుకు వెళుతున్నావని డీఎస్పీ అడిగాడు. అయితే సదరు వ్యక్తి సమాధానం చెప్పేలోగానే, ఆ బుడతడు ట్యూటర్ ఎక్కడ వుంటుందో చెప్పడం ప్రారంభించాడు. చిన్నారి నోరు మూయించేందుకు అతని మామ ప్రయత్నించినా, పోలీసుల ముందు అతని పప్పులు ఉడకలేదు. ట్యూషన్ చెప్పే ఇంటివైపు చేయి చూపించిన ఆ చిన్నారి, పోలీసులను అక్కడికి తీసుకుని వెళ్లాడు.

ఇక ఆ ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టగానే, ఓ మహిళ తలుపు తీసింది. "ఈ బాలుడికి మీరు ట్యూషన్ చెబుతున్నారా? " అని డీఎస్పీ ప్రశ్నించగా, తానేమీ ట్యూషన్లు చెప్పడం లేదని ఆమె పేర్కొంది. ఆ వెంటనే లోపలే కూర్చున్న మరో ముగ్గురు చిన్నారులను చూపించాడట ఈ చిన్నారి.

ఆపై ఆమెను గట్టిగా మందలించిన డీఎస్పీ, పిల్లలను ట్యూషన్ కు తీసుకుని బయలుదేరిన వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చి, మరోసారి ఈ విధంగా చేయనని హామీ తీసుకుని ఇంటికి పంపించారు. లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News