Nitin Gadkari: చైనాకు దూరమవుతున్న ప్రపంచం చూపంతా ఇండియా వైపు: నితిన్ గడ్కరీ

  • కరోనా కారణంగా చైనా నుంచి వెనక్కు తగ్గుతున్న పెట్టుబడులు
  • వాటిని ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం చర్యలు
  • యూఎస్, ఇటలీ, ఫ్రాన్స్ నుంచి ఇన్వెస్ట్ మెంట్స్ వచ్చే అవకాశం
  • లాక్ డౌన్ ముగిసిపోతే, ఇండియాలో రికవరీ వేగమన్న నితిన్ గడ్కరీ
Nitin Gadkari Says World Moves Away from China

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా, దిగజారిన భారత వృద్ధి అతి త్వరలోనే తిరిగి పుంజుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తాజాగా సీఎన్ఎన్ - న్యూస్ 18కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, చైనాకు ప్రపంచమంతా దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇది భారత్ కు ఓ వరం వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశీ కంపెనీలతో మరిన్ని జాయింట్ వెంచర్లను ప్రారంభించి, ముందుకు సాగాల్సిన సరైన సమయం వచ్చేసిందని ఆయన అన్నారు.

కరోనా వైరస్ చైనాలో పుట్టడం, అది మానవ తప్పిదం ద్వారానే బయటకు వచ్చిందన్న వార్తల నేపథ్యంలో, ఆ దేశంతో వ్యాపార సంబంధాలను పెంచుకోవాలన్న ఆలోచనను పలు దేశాలు విరమించుకున్నాయి. గతంలో జపాన్ ప్రకటించిన 2 బిలియన్ డాలర్ల ఫండ్ ను నెగటివ్ సెంటిమెంట్స్ కారణంగా వెనక్కు తీసుకుంది. ఈ తరహా యాంటీ చైనా సెంటిమెంట్ ను భారత్ అందిపుచ్చుకోవాలని, జపాన్ తో ద్వైపాక్షికంగా సత్సంబంధాలున్న ఇండియా, అక్కడి నుంచి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు.

"పశ్చిమ దేశాల నుంచి మంచి స్పందన వస్తుందన్న నమ్మకం నాకుంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి. విదేశీ పెట్టుబడులకు ఇండియా ఓ మంచి స్వర్గధామం అవుతుంది. ఇక్కడి నైపుణ్యవంతులైన కార్మికులు, తక్కువ ధరకు లభించే భూమి విదేశీ కంపెనీలను ఆకర్షిస్తాయి" అని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.

చిన్న, మధ్య తరహా సంస్థలకు, వాహన రంగానికి సమీప భవిష్యత్తులో ఏ విధంగా సహాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్న ప్రశ్నకు, ఈ కంపెనీలకు ద్రవ్య లభ్యతే ప్రధాన సమస్యని, దానిపై దృష్టిని సారించామని, ఎస్ఎంఈ సెక్టార్ భారత ఆర్థిక వృద్ధికి అత్యంత కీలకమని అన్నారు. ఇక, తన మార్గ నిర్దేశంలో పనిచేస్తున్న ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) వార్షిక లక్ష్యాలను సడలించే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఆయన తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రహదారుల విస్తరణ లక్ష్యాన్ని రెట్టింపు చేస్తామని, అందరు కాంట్రాక్టర్లకూ బిల్లు బకాయిల తక్షణ చెల్లింపులు జరపాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చానని అన్నారు. కాంట్రాక్టర్ల వద్ద నగదు కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం తాను చేయగలిగినదంతా చేస్తుందని అన్నారు.

రహదారులపై 65 శాతం ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగిందని, ఎగుమతులు తిరిగి ప్రారంభం అయ్యాయని గుర్తు చేసిన ఆయన, తన శాఖలోని అధికారులంతా పూర్వపు స్థాయిలో పనిచేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చానని అన్నారు. రహదారి నిర్మాణ పనుల్లో పాల్గొనే కార్మికుల మధ్య భౌతిక దూరం తప్పనిసరి చేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ లను ధరించేలా చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టరుదేనని స్పష్టం చేశారు.

దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపు కోసం రూ. 1 లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేశామని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ నిధి ఎంఎస్ఎంఈ సెక్టారుకు ఉద్దీపనలా పని చేస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. భారీ పరిశ్రమల నుంచి ఈ సంస్థలకు రావాల్సిన బకాయిలను కూడా వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు వెల్లడించారు.

లాక్ డౌన్ కారణంగా స్వస్థలాలకు వందల కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయిన లక్షలాది మంది వలస కార్మికుల సమస్యను ప్రస్తావించిన గడ్కరీ, అటవీ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ సమస్యను భవిష్యత్తులో నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. నోయిడా, గురుగ్రామ్, ముంబయి, బెంగళూరు తదితర నగరాల్లోని పరిశ్రమలను ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలకు తరలించే ఆలోచనలో ఉన్నామని, పారిశ్రామిక వికేంద్రీకరణపై దృష్టిని సారించామని తెలిపారు. 

More Telugu News