Zhang Wenhong: భారతీయుల్లో మానసికపరమైన రోగనిరోధక శక్తి ఎక్కువ!: చైనా నిపుణుడి ఆసక్తికర వ్యాఖ్యలు

  • భారతీయులకు భౌతిక ఇమ్యూనిటీ తక్కువ అని వెల్లడి
  • మానసిక ప్రశాంతత మెండు అని వ్యాఖ్యలు
  • భారత్ లో 90 శాతం ప్రజలను కరోనా ఏమీ చేయలేదని వివరణ
China expert says Indians have mental immunity

ప్రపంచదేశాలన్నీ కరోనాతో కకావికలం అవుతున్న వేళ భారత్ లో దారుణం అనదగ్గ పరిస్థితులు ఇప్పటివరకు లేవు. దీనిపై చైనాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ వెన్ హాంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన విద్యార్థులతో వీడియో క్లాసులో మాట్లాడుతూ.... భారత్ లోని ప్రజల్లో శారీరక వ్యాధి నిరోధక శక్తి తక్కువ అని, కానీ వారిలో మానసిక ఇమ్యూనిటీ ఎక్కువ అని వ్యాఖ్యానించారు.

"భారత్ లో జరిగిన ఓ మతపరమైన సమావేశానికి హాజరైన ప్రజల్లో ఎవరూ మాస్కులు ధరించి కనిపించకపోవడాన్ని వార్తల్లో చూశాను. భారతీయులు మానసికంగా ఎంతో దృఢమైన వాళ్లు అన్న విషయం అప్పుడే అర్థమైంది. వారిది ప్రశాంత మనస్తత్వం. ఓవైపు అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరిగిపోతున్నా, భారత్ లో అంత తీవ్రత కనిపించడంలేదు. భారత్ లో కరోనా ఇన్ఫెక్షన్ శాతం 10కి మించదు. భారత్ లోని 90 శాతం ప్రజలను కరోనా ఏమీచేయలేకపోవచ్చు" అని వివరించారు.

ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,077 కాగా, మరణాల సంఖ్య 718కి పెరిగింది. భారత్ లోనూ కరోనా సామాజిక సంక్రమణం దశకు చేరుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నా, అది అమెరికా, యూరప్ దేశాలతో పోల్చితే ఏమంత ప్రమాదకరం కాదని జాంగ్ వెన్ హాంగ్ అభిప్రాయపడ్డారు. చైనా కొవిడ్-19 వ్యూహకర్తలలో జాంగ్ కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆయన హుషాన్ హాస్పిటల్ లో అంటురోగాల విభాగం డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

More Telugu News