Pakistan: పాక్‌ కొత్త కుట్ర.. జమ్మూ కశ్మీర్​కు కరోనా బాధితుల చేరవేత

  • కశ్మీర్ లోయలో వైరస్ వ్యాప్తికి కుట్ర చేస్తోంది
  • జమ్మూ కశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ వెల్లడి
  • ఇదివరకే హెచ్చరించిన ఆర్మీ ఉన్నతాధికారి
Pak Now Exporting Coronavirus Patients To Jammu And Kashmir

భారత్‌లో కరోనా వ్యాప్తికి పాకిస్థాన్‌ కుట్ర చేస్తోంది. కరోనా వైరస్‌ సోకిన వారిని జమ్మూ కశ్మీర్ కు పంపిస్తోంది. తద్వారా ఆ రాష్ట్రంలో వైరస్‌ను వ్యాప్తి చేయాలని దాయాది దేశం కుట్ర చేస్తోందని జమ్మూ కశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ కు  20 కిలోమీటర్ల దూరంలోని గందర్బాల్ జిల్లాలోని ఓ క్వారంటైన్ సెంటర్ ను పరిశీలించిన తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

 ‘కశ్మీర్ లోయలోకి పాక్ కరోనా రోగులను చేరవేస్తోందనేది నిజం. ఈ విషయాన్ని మేం గుర్తించాం. ఇప్పటిదాకా పాక్ ఉగ్రవాదులనే కశ్మీర్ కు పంపించేది. కానీ, ఇప్పుడు ఇక్కడి ప్రజలకు వైరస్ అంటించేందుకు కొవిడ్19 రోగులను చేరవేస్తోంది. ఈ విషయంలో మేం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని అయన చెప్పారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మీదుగా కరోనా రోగులను సరిహద్దు దాటిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని  కొన్ని వారాల కిందటే ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

పీఓకేలో ఇప్పటిదాకా యాభై మందికి వైరస్ సోకగా... వారంతా మీర్పూర్ జిల్లాకు చెందిన వారే. ఈ నెల మొదట్లో  కేరన్ సెక్టార్ మీదుగా భారత్‌లోకి చొరబడేందుకు చాలా మంది ఉగ్రవాదులు ప్రయత్నించగా.. మన ఆర్మీ తిప్పికొట్టింది. ఈ దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు హతమవ్వగా, ఐదుగురు భారత జవాన్లు కూడా చనిపోయారు. అప్పటి నుంచి ఎల్‌ఓసీ దగ్గర భారత్, పాక్‌ ఆర్మీ మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News