Kerala: కరోనా మహా మొండిది... కేరళ మహిళకు 19 సార్లు పాజిటివ్!

  • ఇటలీ నుంచి వచ్చిన కుటుంబసభ్యుల ద్వారా మహిళకు కరోనా
  • మహిళలో బయటికి కనిపించని కరోనా లక్షణాలు
  • అనేక మందులు ఇస్తున్నా కనిపించని ప్రయోజనం
Kerala woman tested corona positive for nineteen times

వైద్య శాస్త్రానికే సవాల్ గా నిలిచిన కరోనా వైరస్ చికిత్సకు అంత తేలిగ్గా లొంగడం లేదనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. కేరళలోని ఓ మహిళకు 42 రోజులుగా చికిత్స అందిస్తున్నా ఫలితం కనిపించడంలేదు. ఆ మహిళకు 19 సార్లు పరీక్ష చేయగా అన్నిసార్లు పాజిటివ్ అనే వచ్చింది. పత్తనంతిట్ట ప్రాంతానికి చెందిన ఆమె వయసు 62 సంవత్సరాలు. ఇటలీ నుంచి వచ్చిన కుటుంబ సభ్యుల కారణంగా ఆమెకు కరోనా సోకింది. మార్చి 10న ఆసుపత్రిలో చేరింది.

నెలరోజులకు పైగా వైద్య పర్యవేక్షణలో ఉన్నా ఆమెలో కరోనా వైరస్ జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. 19 పరీక్షల్లోనూ కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే, కరోనా లక్షణాలు ఆమెలో పెద్దగా బయటికి కనిపించడం లేదని వైద్యులు అంటున్నారు. వైరస్ ను నిర్మూలించేందుకు అనేక కాంబినేషన్లలో మందులు వాడుతున్నా ప్రయోజనం కనిపించడం లేదని పత్తనంతిట్ట జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.షీజా తెలిపారు.

ఈ విషయాన్ని రాష్ట్ర మెడికల్ బోర్డుకు కూడా నివేదించామని వెల్లడించారు. ఆమెకు ఇతర వ్యాధులేవీ లేవని, కరోనా లక్షణాలేవీ బయటికి కనిపించకపోయినా, ఇతరులకు వ్యాపింప చేస్తుందని వివరించారు. తదుపరి పరీక్షలోనూ కరోనా పాజిటివ్ వస్తే ఆమెను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలిస్తామని డాక్టర్ షీజా తెలిపారు.

More Telugu News