Corona Virus: ఢిల్లీలో ఒకే చోట 38 కరోనా కేసులు... మూడో అతిపెద్ద హాట్ స్పాట్ ఇదే!

  • తుగ్లకాబాద్ లో ఒక్కసారిగా బయటపడిన కొత్త కేసులు
  • మొత్తం ప్రాంతాన్నంతా సీజ్ చేసిన అధికారులు
  • అతిపెద్ద హాట్ స్పాట్ గా నిజాముద్దీన్, ఆపై చాందినీ మహల్
Third Biggest Corona Hot Spot in Delhi is Tughlakabad

న్యూఢిల్లీలో కరోనా వైరస్ మరణమృదంగాన్నే మోగిస్తోంది. దక్షిణ ఢిల్లీ పరిధిలోని తుగ్లకాబాద్, ఇప్పుడు దేశ రాజధానిలో మూడో అతిపెద్ద హాట్ స్పాట్ గా అవతరించింది. తాజాగా ఇక్కడ 38 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. తొలుత ఇక్కడ ముగ్గురికి వైరస్ సోకింది. వారిలో ఓ వ్యక్తి నిత్యావసరాల దుకాణాన్ని నడుపుకుంటున్నాడు. ఆపై ఈ ప్రాంతంలోని 94 మందికి కరోనా వైద్య పరీక్షలు చేయగా, 35 మందికి వైరస్ సోకినట్టు తేలింది.

దీంతో తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ ప్రాంతాన్నంతా సీజ్ చేసిన అధికారులు, కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ 35 మందితోనూ కాంటాక్ట్ అయిన వారందరి వివరాలనూ సేకరించి, వారిని క్వారంటైన్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

కాగా, న్యూఢిల్లీలో అతిపెద్ద కరోనా హాట్ స్పాట్ గా నిజాముద్దీన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన మత ప్రార్థనల కారణంగా, దేశంలో వేలాది మందికి వైరస్ సోకింది. ఇక, రెండో హాట్ స్పాట్ గా చాందినీ మహల్ ప్రాంతం నిలిచింది.

More Telugu News