King Kobra: వండుకునేందుకు బియ్యం లేక... కింగ్ కోబ్రాను చంపి తినేసిన అరుణాచల్ వాసులు!

  • ఆహారం కోసం అడవికి వెళ్లిన యువకులు
  • విషసర్పం కనిపించడంతో దాంతోనే విందు
  • వీడియో వైరల్ కావడంతో కేసు పెట్టిన అధికారులు
Arunachal Youth eat King Kobra amid No Rice at Home

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండగా, అన్నం వండుకునేందుకు బియ్యం నిండుకోవడంతో, అడవిలోకి వెళ్లి, భయంకరమైన విషసర్పంగా పేరున్న కింగ్ కోబ్రాను చంపి తెచ్చి, వండుకుని తిన్నారు కొందరు. ఈ మొత్తం ఘటనను వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ గ్రూప్ గా కలిసిన వేటగాళ్లు, సుమారు 12 అడుగుల పొడవున్న పామును, చంపి తెచ్చారు.

ఈ వీడియోలోని ఓ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం, వారి ఇళ్లల్లో బియ్యం అయిపోయాయి. దీంతో ఏదైనా తినేందుకు తెచ్చుకోవాలని అడవికి వెళ్లగా, కింగ్ కోబ్రా కనిపించింది. దీంతో దాన్నే ఆహారంగా చేసుకోవాలని వారు భావించారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో, స్పందించిన అధికారులు, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. కింగ్ కోబ్రా ఈ చట్టం ప్రకారం రక్షిత సర్పం. ఈ నేరానికి వారికి బెయిల్ కూడా లభించదు.

అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో ఈ తరహా విషపూరిత సర్పాలు కోకొల్లలు. ఈ వీడియోలో కనిపించిన యువకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.

More Telugu News