FDI: టేకోవర్ల విషయంలో.. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ కీలక నిర్ణయం!

  • ఇటీవలే హెచ్ డీఎఫ్ సీలో వాటా పెంచుకున్న చైనా బ్యాంకు
  • విదేశీ పెట్టుబడులకు తమ అనుమతి తప్పనిసరి అన్న కేంద్రం
  • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానానికి సవరణ
India makes mandatory approval for fdi

ఇటీవలే చైనాకు చెందిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో తన వాటాను మరింత పెంచుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. డ్రాగన్ ను ఇలాగే వదిలిపెడితే భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టడమే కాకుండా, దేశీయ కంపెనీలను టేకోవర్ చేసి దేశ ఆర్థిక రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్ తో సరిహద్దు పంచుకునే దేశాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు భారత్ లో పెట్టుబడులు పెట్టదలచుకుంటే అందుకు కేంద్రం అనుమతి తప్పనిసరి అని ఓ ప్రకటన చేసింది. తమ ఆమోదం లేనిదే విదేశీ పెట్టుబడులను అనుమతించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు భారత పారిశ్రామిక ఉన్నతి, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

ఇప్పటివరకు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని కేంద్రం సవరించిందని, కరోనా విపత్తు నేపథ్యంలో అవకాశవాద పెట్టుబడులు, టేకోవర్లకు చెక్ పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుందని ఆ ప్రెస్ నోట్ లో వివరించారు. ఈ నిర్ణయం చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలకు వర్తించనుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో సంబంధం ఉన్న యాజమాన్య బదలాయింపులు, ఇతర లావాదేవీలకు సైతం కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందేనని డీపీఐఐటీ స్పష్టం చేసింది.

More Telugu News