Tollywood: అమితాబ్ నాకు ఫోన్ చేసి అందరినీ అభినందించారు: చిరంజీవి

  • సీసీసీ గురించి తెలుసుకొని నాతో మాట్లాడారు
  • ఒకే రోజు వెయ్యి మందికి సాయం చేశారని తెలిసి ఆశ్చర్యపోయా
  • మన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు
 Amitabh appriciated everyone ovee CCC says chiranjeevi

కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారికి సాయం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైంది. చిరు చొరవతో టాలీవుడ్‌ ప్రముఖులు విరాళాలు ఇచ్చి.. సినీ కార్మికులకు సాయం చేస్తున్నారు. దీని ద్వారా తాజాగా ఒకేసారి వెయ్యి మంది కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ విషయం తెలిసి తాను ఆశ్చర్యపోయానని, చాలా ఆనంద పడ్డానని చిరంజీవి చెప్పారు. ఇంత పెద్ద పని చేయాలంటే ప్రతి ఒక్కరూ సైనికుల్ల ముందుకు రావాలన్నారు.

 దీన్ని ఒక బాధ్యతగా, ధర్మంగా భావించి కార్మికులకు సాయం చేస్తున్నామని తెలిసి చిత్ర పరిశ్రమలోని వారు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. అలాగే, ఈ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని  చెప్పారు.  సీసీసీ గురించి తెలుసుకొని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనకు ఫోన్ చేసి మాట్లాడారని చిరంజీవి తెలిపారు. దీనికి సాయం చేస్తున్న అందరినీ అభినందించారని చెప్పారు. సీసీసీని ముందుండి నడిపిస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్. శంకర్, మెహర్ రమేశ్‌కు చిరు అభినందనలు తెలిపారు.

More Telugu News