Flights: రిఫండ్ ఇచ్చే అవకాశం లేదు... ముందుగా బుక్ చేసుకున్న టికెట్లపై ఎయిర్ లైన్స్ షాకింగ్ నిర్ణయం!

  • మే 3 వరకూ అమలుకానున్న లాక్ డౌన్
  • రిఫండ్ కు బదులుగా ప్రయాణాల రీషెడ్యూల్
  • చార్జీలు పెరిగితే తేడాను చెల్లించాల్సిందే
No Refund for Passengers if Flights Cancel

ఇండియాలో వచ్చే నెల 3వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పొడిగించిన నేపథ్యంలో, అప్పటివరకూ విమానాల రద్దు కూడా అనివార్యం కాగా,  ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి రిఫండ్స్ ఇచ్చే అవకాశం లేదంటూ, ఎయిర్ లైన్స్ సంస్థలు షాకింగ్ న్యూస్ చెప్పాయి. విమానాలు రద్దు అయినా, టికెట్ల రిఫండ్ చేయరాదని నిర్ణయించామని, ప్రయాణికులు అదనపు రుసుములు చెల్లించకుండా, మరో తారీఖును ఎంచుకుని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవచ్చని గో ఎయిర్ వెల్లడించింది.

మే 3 వరకూ తమ అన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసిన విస్తారా, ఈ సంవత్సరం డిసెంబర్ 31లోగా, ప్రయాణికులు రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, రీ బుకింగ్ చేసుకునే సమయంలో చార్జీలు పెరిగితే, ఆ తేడాను చెల్లించాల్సిందేనని పేర్కొంది. రీ షెడ్యూలింగ్ స్కీమ్ ఈ నెల 30వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఇక ఎయిర్ లైన్స్ సంస్థల వైఖరిపై సీఏపీఏ (సెంటర్ ఫర్ ఏసియా పసిఫిక్ ఏవియేషన్) అసంతృప్తిని వ్యక్తం చేసింది. 14తో లాక్ డౌన్ తొలగిపోతుందా? లేదా? అన్న విషయం తెలియకుండా టికెట్లను జారీ చేయడం సరికాదని అభిప్రాయపడింది. ప్రయాణికులను నష్టపరిచే ఈ విషయమై ఎయిర్ లైన్స్ సంస్థలు మరోసారి రివ్యూ చేయాలని కోరింది.

More Telugu News