Corona Virus: ఉచిత కరోనా టెస్టులు పేదవాళ్లకు మాత్రమే: సుప్రీం స్పష్టీకరణ

Suprem Court tells free corona tests only for poor
  • అందరికీ ఫ్రీ అంటూ గతవారం పేర్కొన్న సుప్రీం
  • ఉచితంగా టెస్టులు తమ వల్ల కాదన్న ప్రైవేటు ల్యాబ్ లు
  • ఎవరెవరికి ఉచితమో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలన్న సుప్రీం
కరోనా నిర్ధారణ పరీక్షలు అందరికీ ఉచితంగా నిర్వహించాలని గతవారం పేర్కొన్న సుప్రీం కోర్టు తాజాగా తన నిర్ణయాన్ని సవరించుకుంది. కరోనా టెస్టులు పేదవారికి మాత్రమే ఉచితంగా చేయాలని స్పష్టం చేసింది. ఎవరెవరికి ఉచితంగా కరోనా టెస్టులు వర్తింపజేయాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని సూచించింది. కొన్నిరోజుల కిందట అందరికీ ఉచితంగా కరోనా టెస్టులు అందుబాటులోకి తేవాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొనగా, తాము ఉచితంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేమని ప్రైవేటు ల్యాబ్ లు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీం తన నిర్ణయాన్ని సవరించుకుంది.

"ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద లబ్దిపొందుతున్నవారు, బలహీన వర్గాల కేటగిరీలో ప్రభుత్వ గుర్తింపు పొందినవారు  అర్హులుగా భావించి వారికి ఉచిత కరోనా నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలి" అని వివరించింది. అయితే బలహీన వర్గాల్లో ఎవరెవరు ఈ వెసులుబాటుకు అర్హులో కేంద్రం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించుకోవచ్చని తెలిపింది.
Corona Virus
Tests
Supreme Court
COVID-19
India

More Telugu News