పోలీసులపై దాడికి దిగిన ముగ్గురికి కరోనా పాజిటివ్... అధికారుల్లో తీవ్ర ఆందోళన!
- ఇండోర్ లో దాడి చేసిన ముగ్గురు
- సాత్నా, జబల్ పూర్ జైళ్లకు తరలింపు
- వారిని తరలించిన వారు, జైలు అధికారులు క్వారంటైన్
ఇంతవరకూ సాత్నా జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తాజా ఘటనతో వీరితో సంబంధాలున్న వారిని గుర్తించేందుకు అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. వీరు ముగ్గురినీ జైలుకు పంపేముందు పరీక్షలు నిర్వహించాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలుస్తోంది. ఈ కొత్త కేసుతో సహా జబల్ పూర్ లో కరోనా పాజిటివ్ కేసులు 9కి పెరుగగా, ఇండోర్ లో 311 మంది చికిత్స పొందుతున్నారు.
"ఇండోర్ పోలీసుల నుంచి మాకు ముందుగా సమాచారం అందలేదు. వారిని జైలు వద్దకు తీసుకుని వచ్చిన తరువాతే వారు చేసిన నేరం గురించి తెలిసింది. వారిని ఐసొలేషన్ జైలు గదిలో ఉంచాం. ఆపై జబల్ పూర్ నిందితుడికి పాజిటివ్ రావడంతో, వీరికి కూడా పరీక్షలు చేయించగా, పాజిటివ్ అని తెలిసింది" అని సాత్నా జిల్లా కలెక్టర్ అజయ్ కటేసారి వెల్లడించారు. దీంతో జైలులో గత రెండు రోజులుగా వీరిని కలిసిన అధికారులను హోమ్ క్వారంటైన్ చేసి, ఖైదీలను ఐసొలేషన్ సెల్స్ లోకి తరలించామని అన్నారు. వీరిని జైలుకు తరలించడంలో సాయపడిన ఎనిమిది మంది పోలీసులకు సమాచారం ఇచ్చి, క్వారంటైన్ చేశామని వెల్లడించారు.