Gautam Gambhir: యువరాజ్‌ సింగ్‌ చెప్పినదానితో ఏకీభవిస్తున్నాను!: గౌతం గంభీర్‌ కీలక వ్యాఖ్యలు

  • ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో రోల్‌ మోడల్స్‌ కొరత ఉంది
  • అప్పట్లో ద్రవిడ్, కుంబ్లే, లక్ష్మణ్, సౌరవ్, సచిన్ ఉండేవారు
  • జట్టుకి మార్గ దర్శకంగా ఉండేవారు
  • కొత్త కుర్రాళ్లకు సాయం చేసేవారు ఇప్పుడు లేరు 
Theres a dearth of role models in current Indian team Gautam Gambhir

ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో రోల్‌ మోడల్స్‌ లేరని ఇటీవల మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలను టీమిండియా మాజీ ఆటగాడు, ఎంపీ గౌతం గంభీర్‌ సమర్థించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'నేను యువీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుత టీమిండియాలో రోల్‌ మోడళ్ల కొరత ఉంది. 2000 సమయంలో టీమిండియాలో ద్రవిడ్, కుంబ్లే, లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్‌ వంటి సీనియర్లు ఉండేవారు' అని తెలిపారు.

'జట్టుకి మార్గదర్శకంగా ఉండేవారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఇటువంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉండడం ముఖ్యం. ప్రస్తుత జట్టులో అటువంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నట్లు నేను భావించట్లేదు. తమ సొంత ప్రయోజనాలను పక్కనపెట్టి కొత్త కుర్రాళ్లకు సాయం చేసేవారు లేరు' అని గంభీర్‌ వ్యాఖ్యానించారు.  
 
కాగా, ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో రోహిత్‌ శర్మతో యువరాజ్ సింగ్‌ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో తమ సీనియర్లు చాలా క్రమశిక్షణతో ఉండేవారని, అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదని ఆయన అన్నారు.

దీంతో వారి దృష్టి ఆ విషయంపైకి కూడా మళ్లేదికాదని తెలిపారు. వారిని చూసి నేర్చుకుని క్రమశిక్షణతో మనం ఉండాల్సి వచ్చేదని యువరాజ్‌ సింగ్‌ అన్నారు. వారు ప్రేక్షకులు, మీడియాతో మాట్లాడే విధానాన్ని చూసి నేర్చుకునేవాళ్లమని, సీనియర్లు ఆటకు, భారత్‌కు అంబాసిడర్లలాంటి వారని చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని, టీమిండియాలో ఆడితే ఆ తర్వాత సొంత ఇమేజ్‌పై శ్రద్ధ పెడుతున్నారని అన్నారు.  

More Telugu News