Nimmagadda Ramesh: నన్ను కావాలనే టార్గెట్ చేశారు: హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్

  • ఎన్నికలను వాయిదా వేయకుంటే రాష్ట్రం కరోనా హాట్ స్పాట్ గా మారుండేది
  • ఆర్డినెన్స్ తీసుకు రావడం చట్ట విరుద్ధం
  • జీవోలను నిలుపుదల చేయాలని కోరిన నిమ్మగడ్డ
Nimmagadda Petition in High Court

తాను నిష్పక్షపాతంగా పని చేస్తుంటే, ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని, వైసీపీ నేతలపై ఫిర్యాదులు రాగా, తాను నివేదికలు కోరడమే తప్పైందని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆరోపించారు. తనను తొలగించేందుకు ఆర్డినెన్స్ తీసుకుని రావడాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ఆయన, వెంటనే జీవోపై స్టే విధించాలని కోరారు. తాను స్థానిక ఎన్నికలను వాయిదా వేయకుంటే, ఏపీ ఈపాటికి కరోనా హాట్ స్పాట్ గా మారి ఉండేదని, అయితే, ఎన్నికలు వాయిదా వేయాలని తాను తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి, తనకు మధ్య ఘర్షణ జరిగిందని ఆయన వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని, సర్వీస్ నిబంధనలను మారుస్తూ జారీ చేసిన జీవోలను నిలుపుదల చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు నిన్న సాయంత్రం హైకోర్టులో ఆయన ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఆర్డినెన్స్ లను తేవాలని, అది కూడా న్యాయ సమీక్షకు లోబడివుండాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, ఏపీలో అలాంటి పరిస్థితి లేకున్నా, తనను తప్పించాలన్న ఉద్దేశంతోనే జీవో తెచ్చారని ఆయన ఆరోపించారు.

ఆర్డినెన్స్ ల జారీలో అధికార దుర్వినియోగం జరిగిందని భావిస్తే, కోర్టులు జోక్యం చేసుకోవచ్చని తన పిటిషన్ లో గుర్తు చేసిన నిమ్మగడ్డ, సీఎం అభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలను వాయిదా వేయడం తన తప్పయి పోందని అన్నారు. రాష్ట్రాల పరిధిలో ఎన్నికల కమిషనర్ తొలగింపునకు రాజ్యాంగంలోని నిర్దేశిత విధానాన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని ఆరోపించారు.

ఇదిలావుండగా, ఎస్ఈసీ పదవీ కాలాన్ని తగ్గిస్తూ, ఆర్డినెన్స్ తేవడం, ఆ వెంటనే నిమ్మగడ్డను తొలగించి, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజును ఆ పదవిలో నియమించడాన్ని సవాల్ చేస్తూ, ప్రకాశం జిల్లా న్యాయవాది తాండవ యోగేశ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు కూడా హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు.

More Telugu News