army: ఆర్మీ అధికారి కడసారి చూపు కోసం.. రోడ్డు మార్గంలో తల్లిదండ్రుల 2600 కి.మీ. ప్రయాణం!

  • క్యాన్సర్ తో మరణించిన కల్నల్ నవజోత్ సింగ్ బాల్
  • అంత్యక్రియల కోసం అమృత్‌సర్ నుంచి బెంగళూరుకు బయల్దేరిన తల్లిదండ్రులు
  • విమాన సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంపై ఆర్మీ వర్గాల అసంతృప్తి
Outrage As Parents Forced To Drive 2600 km For Army Officers Funeral

శౌర్యచక్ర పురస్కారం అందుకున్న ఓ ఆర్మీ అధికారి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన తల్లిదండ్రులకు విమానం ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. క్యాన్సర్ తో మరణించిన తమ కుమారుడి చివరి చూపు కోసం ఆ జవాను తల్లిదండ్రులు అమృత్‌సర్ నుంచి బెంగళూరుకు ఏకంగా 2600 వంద కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడడంపై పలువురు సీనియర్ ఆర్మీ అధికారులు విచారం వ్యక్తం చేశారు.  

 ప్రతిష్టాత్మక శౌర్యచక్ర పురస్కారం అందుకున్న 39 ఏళ్ల కల్నల్ నవజోత్ సింగ్ బాల్ కు ఆర్మీలో మంచి పేరుంది. ఎలైల్ 2 పారా యూనిట్ కమాండెంట్‌గా పని చేశారు. అయితే, క్యాన్సర్ తో  బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో శుక్రవారం తుది శ్వాస విడిచారు. అంతకుముందు రోజు ఆయన ఆసుపత్రి బెడ్‌పై నవ్వుతూ ఓ సెల్ఫీ తీసుకున్నారు.

బాల్ చనిపోయే సమయంలో ఆయన తల్లిదండ్రులు అమృత్‌సర్ లో ఉన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో విమానంలో బెంగళూరు వెళ్లేందుకు వాళ్లకు అనుమతి లభించలేదు. దాంతో బాల్ భౌతికకాయాన్ని ఆర్మీ విమానంలో అమృత్‌సర్ తీసుకెళ్లాలని అధికారులు భావించారు. కానీ, బెంగళూరులోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన తల్లిదండ్రులు నిర్ణయించారు. దాంతో ఆర్మీలోనే పని చేస్తున్న మరో కుమారుడు నవ్‌తేజ్ సింగ్‌తో కలిసి రోడ్డు మార్గంలో సుదూరం ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు ఇంకా జర్నీలోనే ఉన్నారు. ఈ రోజు రాత్రి బెంగళూరు చేరుకునే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని నవ్‌తేజ్ ట్వీట్ చేశారు.

తమ ప్రయాణంలో సాయం చేస్తున్న ఆర్మీకి ధన్యవాదాలు తెలిపారు. దీనిపై ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీపీ మాలిక్ స్పందించారు. బాల్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సమయంలో వారికి భారత ప్రభుత్వం సాయం చేయకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. రూల్స్ శిలాశాసనాలు కావని, ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని మార్చడం లేదా సడలించడం చేయాలని అన్నారు.

More Telugu News