US Fed: రోజురోజుకూ లక్షల్లో పెరుగుతున్న యూఎస్ నిరుద్యోగుల సంఖ్య... 1.70 కోట్ల మంది రోడ్లపైకి!

  • ఏప్రిల్ 4తో ముగిసిన వారాంతంలో ఉద్యోగం కోల్పోయిన 66 లక్షల మంది
  • పరిస్థితి బాగుపడితే శరవేగంగా రికవరీ
  • 2.3 ట్రిలియన్ డాలర్లతో ఉద్దీపన
  • వెల్లడించిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్
Us Unemployment Rate Hiked

అమెరికాలో కరోనా మహమ్మారి కారణంగా నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, తాము ఉపాధిని కోల్పోయామని క్లయిమ్ చేసిన వారి సంఖ్య 1.70 కోట్లను దాటింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4తో ముగిసిన వారాంతానికి మొత్తం 66 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని, యూఎస్ కార్మిక విభాగం వెల్లడించింది.

ఇదిలావుండగా, దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 2.3 ట్రిలియన్ డాలర్లతో ఉద్దీపనను ప్రకటించినట్టు ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ వెల్లడించారు. ఒకసారి కరోనా భయం తగ్గితే, రికవరీ శరవేగంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఇక యూఎస్ లో ప్రభుత్వం తరఫున నిరుద్యోగులకు అందే సాయం కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ లక్షల్లో పెరుగుతోంది. మార్చి 21తో ముగిసిన వారాంతానికి 33 లక్షల మంది, ఆపై వారంలో 69 లక్షల మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీ అయిన యూఎస్ ను కరోనా వైరస్ తీవ్రంగా దెబ్బతీసింది. ఏప్రిల్ లో నిరుద్యోగ రేటు భారీగా పెరగడంతో, రికవరీకి నెలల సమయం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దేశంలో ఆరోగ్య పరిస్థితులు చక్కబడ్డాయన్న పరిస్థితి ఒకసారి ఏర్పడితే, ఆ మరుక్షణమే, అమెరికాలో అన్ని కంపెనీలు, ఫ్యాక్టరీలు తిరిగి ప్రారంభం అవుతాయని, ద్రవ్య లభ్యత సమస్య లేదని ట్రెజరీ విభాగం కార్యదర్శి స్టీవెన్ మున్ చిన్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కరోనా కారణంగా యూఎస్ లో పెరుగుతున్న నిరుద్యోగ రేటు 2008 నాటి ఆర్థిక సంక్షోభాన్ని మించి ఉండవచ్చని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు. దీని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

అమెరికాలో సుమారు 3 కోట్ల మంది వరకూ ఉద్యోగాలు కోల్పోవచ్చని అంచనా వేస్తున్నట్టు ఆక్స్ ఫర్డ్ ఎకానమిస్టులు అంచనా వేశారు. మే నాటికి నిరుద్యోగ రేటు 16 శాతానికి చేరవచ్చని హెచ్చరించారు. కాగా, అమెరికా ప్రకటించిన 2.3 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపనలో 600 బిలియన్ డాలర్లను చిన్న, మధ్యతరహా కంపెనీలకే ఆఫర్ చేస్తామని, ఈ నిధులతో కంపెనీలు రికవరీ కావచ్చని ఫెడ్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక మునిసిపల్ లిక్విడిటీలో భాగంగా మరో 500 బిలియన్ డాలర్లను అందుబాటులో ఉంచుతామని, వీటితో వివిధ రాష్ట్రాల స్థానిక ప్రభుత్వాలు తమ అవసరాలను తీర్చుకోవచ్చని వెల్లడించింది. పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి కఠిన నిర్ణయాన్నైనా తీసుకునేందుకు వెనుకాడబోమని ఈ సందర్భంగా జెరోమీ పావెల్ వ్యాఖ్యానించారు.

More Telugu News