KCR: ఆ మాత్రానికే అంత రాద్ధాంతం ఎందుకు?: తలసాని మండిపాటు

  • విమర్శలు చేస్తున్న వారు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు
  • ఓ పత్రికలో వచ్చిన కథనాన్నే కేసీఆర్ తప్పుబట్టారు
  • పనికిమాలిన దద్దమ్మలే విమర్శలు చేస్తారు
Talasani fires on opposition leaders

కరోనా వైరస్‌కు సంబంధించిన వార్తల విషయంలో మీడియా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోందని, ప్రజల్లో భరోసా నింపాల్సిందిపోయి భయభ్రాంతులకు గురిచేస్తోందంటూ ఇటీవల మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని   ప్రతిపక్ష నేతలు తప్పుబట్టారు.

ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై మండిపడ్డాడు. ఓ పత్రికలో వచ్చిన కథనంపైనే సీఎం మాట్లాడారని వివరణ ఇచ్చారు. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, కొంతమంది పనికిమాలిన దద్దమ్మలు మాత్రం విమర్శలు చేస్తున్నారని తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు విమర్శిస్తున్న వారు ఇన్ని రోజులూ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. విమర్శలకు ఇది సమయం కాదని హితవు పలికారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తలసాని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మొక్కజొన్న, ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. సీఎం చెప్పినట్టే కనీస మద్దతు ధరతో వాటిని కొనుగోలు చేస్తామని తలసాని పేర్కొన్నారు.

More Telugu News