Assam: అస్సాంలో వ్యాపారవేత్తకు ‘కరోనా’.. నెల రోజుల తర్వాత బయటపడ్డ వైనం!

  • ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25 
  • అందులో 24 మంది తగ్లిబీ జమాత్ సభ్యులే
  • ఫిబ్రవరిలో ఢిల్లీ వెళ్లొచ్చిన వ్యాపారవేత్త
  • నెల రోజుల తర్వాత ఆయనకు ‘కరోనా’ పాజిటివ్
Assamee merchant infected by corona virus

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25 ఇప్పటికే నమోదయ్యాయి. ఇందులో 24 మంది తగ్లిబీ జమాత్ సభ్యులే. ఇంకో వ్యక్తి మాత్రం స్థానికంగా నివసిస్తున్న ఓ వ్యాపారవేత్త.  పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సదరు వ్యాపారవేత్త ఫిబ్రవరి 29న ఢిల్లీ నుంచి గౌహతికి తిరిగి వచ్చాడు.  ఒక నెల రోజుల తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడటం గమనార్హం. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లగా ఈ విషయం బయటపడింది.

ఈ విషయమై అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హింతమ బిశ్వ శర్మ మాట్లాడుతూ, ఆ వ్యాపారవేత్త ఢిల్లీ నుంచి తిరిగి గౌహతి వచ్చిన నెల రోజుల తర్వాతే ఆయన ఈ వైరస్ బారినపడ్డట్టు తెలిసిందని అన్నారు. ఢిల్లిలో ఉండగా ఆయనకు ‘కరోనా’ సోకి ఉండకపోవచ్చని, గౌహతి వచ్చిన తర్వాతే ఈ వైరస్ ఉన్న వ్యక్తుల ద్వారా ఆయనకు అంటిందని భావించారు. ఈ వ్యాపారవేత్తను కలిసిన వ్యక్తులు దాదాపు 111 మంది వరకు ఉన్నారని, వారి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ లకు పంపినట్టు తెలిపారు.

కాగా, ‘కరోనా’ బారిన పడ్డ వ్యాపారవేత్త నివసించే స్పానిష్ గార్డెన్ ప్రాంతాన్ని శానిటైజ్ చేశామని, ఆ ప్రాంతంలోని కుటుంబాలను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించినట్టు చెప్పారు. అంతే కాకుండా, ఢిల్లీ నుంచి గౌహతికి తిరిగి వచ్చిన తర్వాత తన స్వస్థలమైన షిల్లాంగ్ లోని నాగౌన్ కు  ఆ వ్యాపారవేత్త వెళ్లినట్టు తెలిసిందని అన్నారు.

More Telugu News