Priyanka Gandhi: ఈ విపత్కర సమయంలో దేశంలో విద్యుత్‌కు అంతరాయం కలగనీయొద్దు!: ప్రియాంకా గాంధీ ఆందోళన

  • లైట్లు స్విచ్ఛాఫ్ చేసి, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలన్న మోదీ
  • పవర్ గ్రిడ్‌పై ప్రభావం పడుతుందన్న నిపుణులు
  • ఇంజనీర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రియాంక
priyanka gandhi on corona

రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు స్విచ్ఛాఫ్ చేసి, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి కరోనాపై పోరాడుతున్న దేశ స్ఫూర్తిని చాటాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వానికి ఓ సూచన చేశారు. పవర్ గ్రిడ్‌పై ప్రభావం పడుతుందని, ఎమర్జెన్సీ సేవలకు విఘాతం కలుగుతుందని విద్యుత్‌ నిపుణులు చెబుతున్న విషయాలను ఆమె ప్రస్తావించారు.

'కరోనాపై ఏకమై దేశం మొత్తం పోరాడుతోంది. పవర్ గ్రిడ్స్‌ అధికారులు, ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ సంక్షోభ సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.

కాగా, విద్యుత్‌ వినియోగం ఒక్కసారిగా పడిపోకుండా ఉండేందుకు వీధి దీపాలు, ఇంట్లోని ఫ్రిడ్జ్‌, ఏసీలు, ఫ్యాన్ల వంటివి స్విచ్ఛాఫ్ చేయొద్దని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించింది.

More Telugu News