Indian Railways: రైల్వే బుకింగ్స్‌పై కొత్తగా ఏ నిర్ణయం తీసుకోలేదు: రైల్వే శాఖ వివరణ

  • లాక్‌డౌన్‌ తర్వాత ప్రయాణాలకు బుకింగ్స్‌ మొదలయ్యాయని వార్తలు
  • ఆ ప్రక్రియ ఎప్పుడూ నిలిపివేయలేదన్న రైల్వే శాఖ
  • 120 రోజుల ముందు నుంచే రిజర్వేషన్ చేసుకోవచ్చని  స్పష్టం
Railways clarify on reservation for journeys post 14th April

కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో జన జీవనం స్తంభించించింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రజా రవాణా వ్యవస్థలన్నీ ఆగిపోయాయి. గూడ్స్ మినహా అన్ని రకాల రైలు సర్వీసులనూ నిలిపి వేశారు. ఈ నేపథ్యంలో  లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఈ నెల 15వ తేదీ నుంచి ప్రయాణాలకు  రైల్వే రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైనందని వార్తలు వచ్చాయి. దీనిపై  రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం ట్విట్టర్లో  వివరణ ఇచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పింది. తాము కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

ఏప్రిల్ 14వ తర్వాతి ప్రయాణాల కోసం రిజర్వేషన్లు, టికెట్ల బుకింగ్స్‌ను తాము నిలిపివేయనే లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కేవలం లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయానికి అంటే మార్చి 24 నుంచి ఏప్రిల్ 14వ తేదీ మధ్యలో ప్రయాణాల బుకింగ్స్‌ను మాత్రమే నిలిపివేశామని చెప్పింది. రైల్వే టికెట్ల కోసం 120 రోజుల ముందు నుంచే అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ఉంటుందని తెలిపింది. అందువల్ల ఏప్రిల్ 15 తర్వాత జరిగే ప్రయాణాల కోసం లాక్‌డౌన్‌ విధించే చాలా రోజుల ముందు నుంచే బుకింగ్స్‌ ఓపెన్‌గా ఉన్నాయని పేర్కొన్నది.

More Telugu News