Tollywood: క్రేజీ కాంబినేషన్.. బాలకృష్ణ, రానాతో మల్టీస్టారర్ సినిమా?

  • తెలుగులో రీమేక్ కానున్న మలయాళ హిట్ చిత్రం     ‘అయ్యప్పనుమ్‌ కోసియుమ్‌’
  • ప్రధాన పాత్రల్లో నటించాలని బాలయ్య, రానాతో నిర్మాతల సంప్రదింపులు!
  • ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆకట్టుకున్న ఇద్దరు హీరోలు
 will Balakrishna and Rana act together in multi starrer

 దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాల్లో కలిసి నటించిన బాలకృష్ణ, దగ్గుబాటి రానా మరోసారి వెండితెర పంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి వీరిద్దరూ పూర్తి స్థాయి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోసియుమ్’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. అయప్పనుమ్ నాయర్ అనే పోలీసు అధికారి, రిటైర్డ్ హవల్దార్ కోషి కురియన్ మధ్య జరిగే ఈగో వార్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో మంచి హిట్టయింది.

ఇందులో బిజు మీనన్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు తెలుగు రీమేక్‌లో బిజు మీనన్ పాత్ర కోసం బాలకృష్ణను నిర్మాతలు ఇప్పటికే సంప్రదించగా, ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పృథ్వీరాజ్‌ పాత్రలో నటించాలని రానా దగ్గరకు కూడా వెళ్లినట్టు సమాచారం. అయితే, దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

ఎన్టీఆర్ బయోపిక్‌లో సీనియర్ ఎన్టీఆర్ గా బాలయ్య, చంద్రబాబు పాత్రలో రానా నటించారు. ప్రస్తుతం  అరణ్య, విరాట పర్వం సినిమాలతో రానా బిజీగా ఉన్నాడు. మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు.

More Telugu News