Pawan Kalyan: సత్వరమే స్పందించినందుకు సీఎం పళనిస్వామికి ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

  • చెన్నై హార్బర్ లో చిక్కుకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారులు
  • వాళ్లను ఆదుకోవాలని కోరిన పవన్
  • వెంటనే అధికారులను పంపిన సీఎం పళనిస్వామి
  • తెలుగు వాళ్ల హృదయాల్లో నిలిచిపోతారంటూ వ్యాఖ్యలు
Pawan thanks to TN CM Palaniswami

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. తమిళనాడులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలన్న తన విజ్ఞప్తికి వెంటనే స్పందించారంటూ పళనిస్వామిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు.

ఇక పళనిస్వామి ఆదేశాలతో చెన్నై కార్పొరేషన్ అధికారులు హార్బర్ లో ఉన్న తెలుగు మత్స్యకారులను కలిసి వారికి నిత్యావసరాలు అందించారని పవన్ వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా చెన్నై హార్బర్ లో చిక్కుకుపోయిన ఆ మత్స్యకారులు తినడానికి తిండి కూడా లేక అలమటించారని వివరించారు.

"మీరు చూపిన ఆదరణను తెలుగు ప్రజలు తమ హృదయాల్లో పెట్టుకుంటారు సర్" అంటూ పళనిస్వామిని పవన్ కొనియాడారు. లాక్ డౌన్ అమలు చర్యలతో ఎంతో బిజీగా ఉన్నా తాను చేసిన అభ్యర్థనకు వెంటనే స్పందించడం పట్ల హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో చెన్నైలో 30 మంది శ్రీకాకుళం మత్స్యకారులు చిక్కుకున్నారు. ఈ విషయం తెలిసిన జనసేనాని పవన్ కల్యాణ్ తమిళనాడు సీఎం పళనిస్వామికి విజ్ఞప్తి చేయగా, సీఎం వెంటనే స్పందించారు.

More Telugu News