Road Accident: ఔటర్ రింగ్‌రోడ్డుపై దారుణం.. బోలేరో ట్రక్కును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు కూలీల దుర్మరణం

  • పనులు లేక స్వగ్రామానికి వెళ్తున్న కూలీలు
  • పెద్ద గోల్కొండ సమీపంలో ఢీకొన్న లారీ
  • ప్రమాద సమయంలో వాహనంలో 30 మంది కూలీలు
6 dead in road accident on outer ring road

ఔటర్ రింగురోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.  పోలీసుల కథనం ప్రకారం.. పనులు లేకపోవడంతో కర్ణాటకకు చెందిన 30 మంది కూలీలు స్వగ్రామం అయిన రాయచూర్‌కు బొలేరో ట్రక్‌లో బయలుదేరారు. ఔటర్ రింగు రోడ్డు మీది నుంచి వీరు వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ సమీపంలో వెనక నుంచి వచ్చిన ఓ లారీ.. బొలేరోను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో బొలేరో డ్రైవర్ సహా ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఆరుగురు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఓ చిన్నారి, బాలిక ఉన్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ నూజివీడు నుంచి గుజరాత్‌కు మామిడి కాయల లోడుతో వెళ్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News