Eatala Rajendar: గాంధీ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో కరోనాకు కేటాయించాలని ఈటల ఆదేశం

  • తెలంగాణలో 44 కరోనా కేసులు
  • అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈటల
  • గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని సూచన
  • సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో సెలవులు ఇవ్వవద్దని ఆదేశం
Telangana health minister Eatala reviews latest situation

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో మన ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరోసారి కితాబిచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. విదేశాల నుండి వచ్చే వారిని స్క్రీన్ చేయడం, హోమ్ క్వారంటైన్ ఉన్నవారికి పరీక్షలు చేయడం లాంటి కార్యక్రమాలు, రాష్ట్రం షట్ డౌన్ చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో కరోనా వ్యాప్తిని అరికడుతున్నామని అన్నారు.

ఇప్పటికే మన దగ్గర వైరస్ వ్యాప్తి రెండవ దశలోకి చేరుకుంది. 26 వ తేదీ మధ్యాహ్నం వరకు 44 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా ఒక్కరికి పూర్తిగా నయం అయ్యింది. మిగిలిన వారందరూ కోలుకుంటున్నారనీ, ఎవరికీ ప్రాణాపాయ స్థితి లేదని మంత్రి తెలిపారు. ఇందులో ఇద్దరు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ లు ఉన్నారని, తాజాగా దేశంలోనే పలు ప్రాంతాల్లో వీరు పర్యటించారని చెప్పారు. వీరిని కలిసిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విదేశాలనుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా గమనించాలని ఈ రోజు సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని మంత్రి కోరారు.

కరోనా వైరస్ గురించి తెలిసిన మొదటి రోజు నుండి అన్ని విధాలా ముందస్తు చర్యలు తీసుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖ ఒకవేళ మూడవ దశలోకి చేరుకుంటే తీసుకోవాల్సిన చర్యలు, మన సన్నద్ధతపై సమీక్షించారు. సర్వేలెన్స్ పెంచడం ద్వారానే దీనిని అరికట్టగలమని ఆ టీమ్స్ ను పెంచాలని ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసేవారు, ఆశ వర్కర్లు ఎక్కడ పని చేసే వారు అక్కడే ఉండేలా చూడాలని, సెలవులు పూర్తిగా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరం ఉన్న చోట్ల సిబ్బందికి భోజన, రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావును ఆదేశించారు. విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరి డేటా ఉండాలని చెప్పారు.

 వ్యాప్తి తీవ్రత పెరిగితే అవసరమయ్యే హాస్పిటల్స్, సిబ్బంది, వైద్య పరికరాలపై చర్చించారు. గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా చికిత్సకే వినియోగించేలా తయారు చేయాలని చెప్పారు. ఇప్పటికే గాంధీలో చేయాల్సిన ఆపరేషన్లను ఉస్మానియా ఆసుపత్రిలో చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు మిగతా అన్ని విభాగాలను కూడా తరలించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డిని ఆదేశించారు. కింగ్ కోటి ఆసుపత్రిని కూడా సిద్ధంగా ఉంచాలన్నారు.

వీటితో పాటు అవసరం అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్ ల సేవలు వినియోగించుకొనేందుకు కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందని తెలియజేశారు.

పేషెంట్ల సంఖ్య పెరిగితే ముందుగా అవసరం అయ్యేది పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్.. వాటిని సాధ్యమైనన్ని ఎక్కువ కొని పెట్టుకోవాలని tsmidc ఎం.డి చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో పనిచేస్తున్న కమిటీ ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన పరికరాలు కొనుగోలు చేయాలని ఆదేశించిన మంత్రి, ఐసీయూ పరికరాలు, వెంటిలేటర్లు సమకూర్చుకోవాలని సూచించారు.

మూడవ దశలోకి వెళ్ళకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వెళ్లకూడదని ఆశిస్తున్నామని మంత్రి అన్నారు. అయినా ముందు జాగ్రత్తగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నామని తెలియజేశారు. ప్రజలు కూడా షట్ డౌన్ ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. పక్కన వారిని కలవకుండా ఉండడమే మనల్ని రక్షిస్తుంది అన్నారు.

More Telugu News