కరోనా సోకిందని ఢిల్లీలో ‘ఈశాన్య’ రాష్ట్ర యువతికి వేధింపులు!
- ఆమెపై కిళ్లీని ఉమ్మిన ఆకతాయి
- కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన పోలీసులు
- ఈశాన్య ప్రాంత వాసులపై వేధింపులు అరికట్టాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈశాన్య రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల యువతి ఢిల్లీలోని విజయ్నగర్ లో ఉంటోంది. సరుకులు కొనుగోలు చేసేందుకు తన స్నేహితుడితో కలిసి బయటికి రాగా..గౌరవ్ వోహ్రా అనే 40 ఏళ్ల వ్యక్తి ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెకు కరోనా వచ్చిందని, ఎవరూ దగ్గరికి వెళ్లొందంటూ అవమానించాడు. అంతటితో ఆగకుండా ఆమెపై పాన్ ఉమ్మేశాడు. దీనిపై సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన విజయ్ నగర్ పోలీసులు గౌరవ్ను అరెస్ట్ చేశారు. అతని స్కూటీని కూడా సీజ్ చేసినట్టు నార్త్ వెస్ట్ డీసీపీ ఆర్య తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను కరోనాతో ముడిపెడుతూ వారిని వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే లేఖ రాసింది.