Chandrababu: చైనాలో ఒక్కరికి సోకింది.. ఇప్పుడు 4 లక్షల మందికి సోకే దిశగా కరోనా: హైదరాబాద్‌లో చంద్రబాబు

  • ఒకరికి వచ్చిన వ్యాధి వందమందికి అంటించుకుంటూ పోవడం భయంకరం
  • ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది 
  • భారత్‌లో జనాభా ఎక్కువ
  • అదుపు చేయలేకపోతే కోట్లాది మందికి కరోనా సోకే ప్రమాదముంది 
chandrababu on corona virus

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలి. దీన్ని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి.  వ్యవసాయ ఉత్పత్తి రంగాలు దెబ్బతింటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. నిత్యావసరాల వస్తువుల ధరలను అదుపు చేయాలి. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం సాయం చేయాలి' అని చెప్పారు.

'తొలి కేసు చైనాలో నమోదయింది. ఒక్కరికి సోకిన కరోనా వందల మందికి అంటింది. ఇప్పుడు 3,76,000 మందికి సోకింది. సాయంత్రం లోపు 4 లక్షల మందికి కరోనా వచ్చే అవకాశం ఉంది. ఒకరికి వచ్చిన వ్యాధి వందమందికి అంటించుకుంటూ పోతే ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది' అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో జనాభా ఎక్కువ, అదుపు చేయలేకపోతే కోట్లాది మందికి కరోనా సోకే ప్రమాదముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని అన్నారు. అందరూ బాధ్యతగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేసి మంచి పని చేశారని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలపై కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ప్రమాదకరమని చెప్పారు.

More Telugu News